కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ కు వంతపాడింది: ప్రధాని మోదీ

Narendra Modi Slams Congress for Supporting Pakistan
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతను పణంగా పెట్టి, జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్‌కు కొమ్ముకాసిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం అసోంలోని దర్రాంగ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాలపై నిప్పులు చెరిగారు.

ఉగ్రవాదంపై పోరాటాన్ని కాంగ్రెస్ బలహీనపరిచిందని మోదీ ఆరోపించారు. "కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం పెట్రేగిపోయింది. ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ, మన సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీసేలా పాకిస్థాన్ వాదనలకు కాంగ్రెస్ వంత పాడింది. మన సైన్యానికి అండగా నిలవాల్సింది పోయి, పాక్ సైన్యానికి మద్దతుగా నిలిచింది" అని ప్రధాని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేవారి గొంతును కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

అసోంలోని మరో ప్రాంతమైన గోలాఘాట్‌లో జరిగిన సభలో చొరబాట్ల అంశాన్ని మోదీ ప్రస్తావించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు రక్షణ కల్పించిందని విమర్శించారు. దీనివల్ల అసోం జనాభా స్వరూపంలో పెను మార్పులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యతిరేక శక్తులను కాపాడటమే కాంగ్రెస్ విధానమని ఆయన ఆరోపించారు.

1962 చైనా యుద్ధం నాటి పరిస్థితులను కూడా మోదీ గుర్తుచేశారు. "అప్పటి ప్రధాని నెహ్రూ అనుసరించిన విధానాల వల్ల చైనా సైనికులు దూసుకువస్తున్నప్పుడు అసోంను, ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఆనాటి నిర్లక్ష్యం మిగిల్చిన గాయాలు అసోం ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి" అని మోదీ అన్నారు.

అయితే, తమ బీజేపీ ప్రభుత్వం అసోంను చొరబాటుదారుల నుంచి విముక్తం చేసేందుకు కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. స్థానిక గిరిజనుల హక్కులను కాపాడేందుకు వారికి భూమి పట్టాలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన వివరించారు.
Go Back to Shorts
Narendra Modi
Congress Party
Pakistan
Assam
terrorism
China war 1962
infiltration
vote bank politics
national security
Indian Army

More Telugu News