ఫ్లిప్‌కార్ట్‌కు భారీ నష్టాలు.. ఆదాయం పెరిగినా తప్పని కష్టాలు!

  • ఫ్లిప్‌కార్ట్ ఇండియాకు భారీగా పెరిగిన నష్టాలు
  • 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,189 కోట్లకు చేరిన నష్టం
  • 17 శాతం  మేర పెరిగిన కంపెనీ ఆదాయం
  • అదే స్థాయిలో ఎగబాకిన ఖర్చులు
  • నష్టాలను తగ్గించుకున్న ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ విభాగం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఇండియా భారీ నష్టాలను ప్రకటించింది. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (FY25) కంపెనీ ఏకీకృత నష్టాలు మరింత పెరిగి రూ.5,189 కోట్లకు చేరాయి. ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో (FY24) ఫ్లిప్‌కార్ట్ ఇండియా నష్టం రూ.4,248.3 కోట్లుగా ఉంది. కాగా, ఈ ఏడాది అది రూ.5,189 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.3 శాతం వృద్ధితో రూ.70,541.9 కోట్ల నుంచి రూ.82,787.3 కోట్లకు చేరింది. అయితే, మొత్తం ఖర్చులు కూడా 17.4 శాతం పెరిగి రూ.88,121.4 కోట్లకు ఎగబాకాయి.

మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌ను నిర్వహించే 'ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్' మాత్రం తన నష్టాలను తగ్గించుకోవడంలో విజయం సాధించడం గమనార్హం. FY24లో రూ.2,358.7 కోట్లుగా ఉన్న ఈ సంస్థ నష్టం, FY25లో రూ.1,494.2 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో ఈ విభాగం ఆదాయం కూడా 14 శాతం వృద్ధితో రూ.20,746 కోట్లకు చేరింది.

ఫ్లిప్‌కార్ట్ ఇండియా మొత్తం ఖర్చులు పెరగడానికి ప్రధాన కారణం 'స్టాక్-ఇన్-ట్రేడ్' కొనుగోళ్లు భారీగా పెరగడమేనని నివేదిక స్పష్టం చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ కొనుగోళ్ల విలువ రూ.74,271.2 కోట్ల నుంచి రూ.87,737.8 కోట్లకు చేరింది. దీంతో పాటు ఫైనాన్స్ ఖర్చులు కూడా సుమారు 57 శాతం పెరిగి రూ.454 కోట్లకు చేరాయి. ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ, పెరుగుతున్న ఖర్చులు కంపెనీ లాభదాయకతకు సవాలుగా మారాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.


More Telugu News