Narendra Modi: మోదీ, ఆయన తల్లిపై వివాదాస్పద ఏఐ వీడియో: కాంగ్రెస్‌పై ఢిల్లీ పోలీసుల కేసు

Narendra Modi AI Video Controversy Delhi Police Case Against Congress
షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన దివంగత తల్లి హీరాబెన్‌ను అపహాస్యం చేసేలా ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వీడియో విషయంలో కాంగ్రెస్ పార్టీ, దాని ఐటీ సెల్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ బీహార్ శాఖ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. బీజేపీ ఢిల్లీ ఎన్నికల విభాగం కన్వీనర్ సంకేత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

సెప్టెంబర్ 10న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' లో పోస్ట్ చేసిన 36 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో, ప్రధాని మోదీ తన తల్లితో కలలో మాట్లాడుతున్నట్లుగా వక్రీకరించి చూపించారు. ‘ఏఐ జనరేటెడ్’ అని స్పష్టంగా పేర్కొన్న ఈ క్లిప్, ప్రధానిపై వ్యక్తిగత దాడి అని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ వీడియో ప్రధాని మోదీ తల్లి గౌరవానికి, మాతృత్వానికి భంగం కలిగించేలా ఉందని సంకేత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయంగా రెచ్చగొట్టేందుకే ఈ వీడియోను విడుదల చేశారని బీజేపీ ఆరోపించింది.

ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. వీడియోలో ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ, "ఆయన తల్లిని ఎక్కడ అగౌరవపరిచామో ఒక్క మాటలోనైనా చూపించండి. బిడ్డకు హితవు చెప్పడం తల్లి బాధ్యత. ఆమె తన బిడ్డకు సలహా ఇస్తున్నారు. అది ఆయనకు అగౌరవంగా అనిపిస్తే, అది ఆయన తలనొప్పి కానీ మాది కాదు" అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఆగస్టు 27, 28 తేదీల్లో దర్భంగాలో కాంగ్రెస్-ఆర్జేడీ నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కూడా ప్రధాని మోదీ, ఆయన తల్లిని కించపరిచేలా నినాదాలు చేశారని బీజేపీ ఫిర్యాదులో ప్రస్తావించింది. ఆ ఘటనపై అప్పట్లో స్పందించిన ప్రధాని, ఇది దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలందరినీ అవమానించడమేనని అన్నారు. ప్రస్తుతం పోలీసులు పరువు నష్టం, మహిళలను కించపరచడం, ఐటీ చట్టం, డిజిటల్ డేటా పరిరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Heeraben Modi
Congress
AI video
Delhi Police
Defamation
Social Media
Bihar Congress
BJP
Pawan Khera

More Telugu News