Supreme Court: గవర్నర్లకు గడువు.. కీలక తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Supreme Court Reserves Verdict on Governors Time Limit
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు, అలాగే కేంద్రం పంపిన బిల్లులపై రాష్ట్రపతికి కాలపరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా లేదా అనే కీలకమైన రాజ్యాంగ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విషయంలో న్యాయసలహా కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన 14 ప్రశ్నల (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) ఆధారంగా సుప్రీంకోర్టు ఈ విచారణ చేపట్టింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపింది. ఆగస్టు 19న ప్రారంభమైన ఈ విచారణ, వివిధ దశల్లో 10 రోజుల పాటు కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. గురువారం తుది వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

విచారణ చివరి రోజున కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వెంకట రమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు అనంతకాలం పాటు తమ వద్దే అట్టిపెట్టుకోవడం సరైన పద్ధతి కాకపోవచ్చని వారు అంగీకరించారు. అయితే, వాటి ఆమోదానికి కచ్చితమైన గడువు విధించడం కూడా సరైన విధానం కాదని కోర్టుకు స్పష్టం చేశారు. ఆర్టికల్ 200 ప్రకారం నిర్ణయం తీసుకునే విషయంలో గవర్నర్‌కు స్వేచ్ఛ ఉండాలని వారు వాదించారు. గత 50 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే, దాదాపు 90 శాతం బిల్లులను గవర్నర్లు నెల రోజుల లోపే ఆమోదించారని వారు కోర్టు దృష్టికి తెచ్చారు.

అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ సంక్లిష్టమైన రాజ్యాంగ అంశంపై తన తుది తీర్పును త్వరలో వెలువరించనుంది. ఈ తీర్పు కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Go Back to Shorts
Supreme Court
Droupadi Murmu
Governors
Presidential Reference
State Bills
Central Government
Article 200
Justice BR Gavai
Attorney General Venkataramani
Solicitor General Tushar Mehta

More Telugu News