GST: జీఎస్టీ ఎఫెక్ట్.. పాత స్టాక్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

GST Effect Central Govt Key Decision on Old Stock Prices
షార్ట్స్‌లో చూడండి
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో ఇటీవల చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న, విక్రయం కాని పాత నిల్వలపై సవరించిన గరిష్ట చిల్లర ధరను (ఎమ్మార్పీ) ముద్రించుకునేందుకు కంపెనీలకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా, పాత ప్యాకేజింగ్ మెటీరియల్‌ను ఈ ఏడాది డిసెంబర్ వరకు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ వద్ద పేరుకుపోయిన పాత నిల్వలను విక్రయిచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ అనుమతి ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా విలువైన ప్యాకేజింగ్ సామగ్రి వృథా అయ్యేదని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ వద్ద సాధారణంగా రెండు నుంచి మూడు నెలల సరుకు నిల్వ ఉంటుందని, వాటిపై పాత ఎమ్మార్పీ ముద్రించి ఉంటుందని పరిశ్రమల సంఘాల ద్వారా ప్రభుత్వానికి విన్నవించాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం, పాత నిల్వలపై స్టిక్కర్లు లేదా స్టాంపుల ద్వారా కొత్త ధరలను ముద్రించుకోవచ్చని స్పష్టం చేసింది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా అందిస్తామని, ప్యాకేజింగ్ వృథా కాకుండా తక్కువ ఖర్చుతో దీనిని ఎలా అమలు చేయాలో పరిశీలిస్తున్నామని పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. అదేవిధంగా అమూల్ సంస్థ కూడా ప్రకటనలు, డిస్కౌంట్ల ద్వారా పాత నిల్వలపై కూడా కొత్త ధరలు వర్తిస్తాయని వినియోగదారులకు తెలియజేస్తామని పేర్కొంది.

ఇటీవల జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలతో వెన్న, చీజ్, మిఠాయిలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. చాక్లెట్లు, బిస్కెట్లు, కాఫీ, ఐస్‌క్రీమ్‌లు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటి అనేక వస్తువులపై పన్ను 18 శాతం నుంచి 5 శాతానికి చేరింది. ఈ పన్ను తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, మార్కెట్లో డిమాండ్ పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
GST
GST rates
Central Government
tax reduction
consumer benefits
old stock
revised MRP

More Telugu News