దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ

  • సెప్టెంబర్ 10 నుంచి డిసెంబర్ 3 వరకు అందుబాటులో
  • మధురై, చెన్నై, బెంగళూరు సహా పలు మార్గాల్లో రైళ్లు
  • వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచన
దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికులకు శుభవార్త చెబుతూ భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారి సౌకర్యార్థం మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

పండగల సమయంలో సాధారణ రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ప్రయాణికుల తాకిడిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు పలు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయి. రైల్వే శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, మధురై-బరౌని మధ్య 12, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-బరౌని మధ్య 12, షాలిమార్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్య 10 రైళ్లు నడుస్తాయి.

అదేవిధంగా, ఎస్‌ఎంవీటీ బెంగళూరు-బీదర్ మధ్య 9, తిరునెల్వేలి-శివమొగ్గ టౌన్ మధ్య 8 సర్వీసులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు తిరువనంతపురం నార్త్-సంత్రాగచి మధ్య 7, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-సంత్రాగచి మధ్య 3 రైళ్లు కూడా నడుస్తాయని అధికారులు వివరించారు. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టేషన్లు, టికెట్ లభ్యత వంటి పూర్తి వివరాల కోసం ప్రయాణికులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.


More Telugu News