శశికళపై మరో సీబీఐ కేసు.. రద్దయిన నోట్లతో రూ.450 కోట్ల లావాదేవీ!

Sasikala Faces New CBI Case Over 450 Crore Illegal Transaction
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో రద్దయిన కరెన్సీతో ఏకంగా రూ.450 కోట్లు వెచ్చించి ఒక చక్కెర ఫ్యాక్టరీని కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆమెపై కొత్తగా కేసు నమోదు చేసింది. బినామీల పేరుతో ఈ భారీ లావాదేవీ జరిపినట్లు సీబీఐ తన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లో స్పష్టంగా పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురంలో ఉన్న ఒక చక్కెర కర్మాగారం పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు గత జూలై నెలలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించారు.

ఈ దర్యాప్తులో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గతంలో స్వాధీనం చేసుకున్న దస్తావేజులను సీబీఐ పరిశీలించింది. ఆ పత్రాల్లో చక్కెర ఫ్యాక్టరీ కొనుగోలు వ్యవహారం శశికళకు సంబంధించిందేనని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీని నడిపిన విదేశ్ శివగన్ పఠేల్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. కర్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు రూ.450 కోట్ల విలువైన రద్దయిన పాత పెద్ద నోట్లను ఉపయోగించినట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం.

అంతేకాకుండా, ఈ చక్కెర కర్మాగారం శశికళకు చెందిన బినామీ ఆస్తి అని ఐటీ శాఖ అప్పటికే ప్రకటించిన విషయాన్ని కూడా సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించింది. తాజా కేసుతో శశికళ మరోసారి తీవ్రమైన న్యాయపరమైన చిక్కుల్లో పడినట్లయింది.
Go Back to Shorts
VK Sasikala
CBI case
demonetization
sugar factory
Jayalalitha
Indian Overseas Bank
Kanchipuram
Videsh Shivagan Patel
benami property

More Telugu News