Milad un Nabi: కాకినాడలో మిలాద్ ఉన్-నబీ ర్యాలీలో పాలస్తీనా జెండాల కలకలం.. నాలుగు కార్లు సీజ్

Kakinada Police Seize Cars Displaying Palestine Flags During Milad un Nabi Rally
షార్ట్స్‌లో చూడండి
కాకినాడలో మిలాద్ ఉన్-నబీ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న కొన్ని కార్లపై పాలస్తీనా జాతీయ జెండాలను ప్రదర్శించడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి, ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మిలాద్ ఉన్-నబీని పురస్కరించుకుని కొందరు ముస్లిం యువకులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నాలుగు కార్లపై పాలస్తీనా జెండాలను కట్టి ప్రదర్శించారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించి, ఆ నాలుగు కార్లను సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో ఆ కార్లలో కొన్ని అద్దెకు తీసుకున్నవని తేలింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు ఈ జెండాలను ఎందుకు ప్రదర్శించారు? వాటిని ఎవరు తయారు చేశారు? ఈ ఘటన వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే, తమకు ఎలాంటి దురుద్దేశం లేదని యువకులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పాలస్తీనా యుద్ధంలో అమాయక ప్రజలు మరణిస్తున్నారని, వారికి సంఘీభావం తెలిపేందుకే జెండాలు ప్రదర్శించామని వారు వివరించారు.

ఈ ఘటనపై కాకినాడ సీఐ స్పందిస్తూ, “పాలస్తీనా జెండాలతో ప్రదర్శన చేసిన నాలుగు కార్లను సీజ్ చేశాం. కొందరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది” అని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 
Go Back to Shorts
Milad un Nabi
Kakinada
Palestine flag
rally
India Palestine relations
Andhra Pradesh
Muslim youth
police investigation
car seizure
solidarity

More Telugu News