Nandamuri Balakrishna: పదవులకే నేను అలంకారం: నిమ్మకూరులో బాలకృష్ణ

Balakrishna Visits Nimmakuru After World Book of Records Achievement
షార్ట్స్‌లో చూడండి
పదవులు తనకు ముఖ్యం కాదని, వాటికే తాను అలంకారం అని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తన సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని, ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించిన తర్వాత ఆయన తొలిసారిగా కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరును సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

నిమ్మకూరు చేరుకున్న బాలకృష్ణకు గురుకుల పాఠశాల విద్యార్థులు గౌరవ వందనంతో స్వాగతం పలకగా, గ్రామ మహిళలు మంగళ హారతులు పట్టారు. అనంతరం, బాలకృష్ణ తన తల్లిదండ్రులైన స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నాకు తండ్రి, గురువు, దైవం అన్నీ ఎన్టీఆరే. ఆయన నటనలో దరిదాపులకు చేరాలన్నదే నా తపన. ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను" అని భావోద్వేగంగా ప్రసంగించారు.

రాయలసీమను తన అడ్డాగా భావిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. "దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. రాయలసీమకు నీరిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నిరూపించారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది" అని తెలిపారు.

సామాజిక అంశాలపై కూడా బాలకృష్ణ స్పందించారు. ఇటీవల తెలంగాణలో వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వాడకంపై ఆయన మాట్లాడుతూ, "ప్రపంచం సోషల్ మీడియా వల్ల చిన్నదైపోయింది. దానిని మంచి పనులకు వాడండి కానీ, వినాశనానికి కాదు" అని యువతకు హితవు పలికారు. తన రాబోయే చిత్రం ‘అఖండ 2’ గురించి వివరిస్తూ, "ఈ సినిమాను ఏ కులానికో ఆపాదించవద్దు. హైందవ ధర్మానికి ప్రతిరూపంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అని స్పష్టం చేశారు. తన సంతోషాన్ని గ్రామస్థులతో పంచుకోవడానికే నిమ్మకూరు వచ్చానని బాలకృష్ణ తెలిపారు. 
Go Back to Shorts
Nandamuri Balakrishna
Balakrishna
Nimmakuru
Hindupuram
NTR
Basavatarakam
Akhanda 2
Chandrababu Naidu
Rayalaseema
Telugu Cinema

More Telugu News