మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

  • నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ క్షేత్రం పాలజ్ కర్ర వెళ్లివస్తుండగా ఘటన 
  • బోకర్ తాలూకా నందా గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తెలంగాణ నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర వినాయకుడి దర్శనానికి వెళ్లిన భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామం నుండి 15 మంది భక్తులు మూడు కార్లలో నిన్న ఉదయం బయలుదేరారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభించారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా నందా గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు, రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో భార్యాభర్తలైన చేకూరి బుల్లిరాజు (53), సునీత (48), బుల్లిరాజు బావమరిది అర్ధాంగి వాణి (45) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం నడుపుతున్న గుణం శేఖర్‌కు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికురాలు నీలిమ కూడా గాయపడగా, ఆమెను నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోకర్ ఆసుపత్రికి తరలించారు. 


More Telugu News