: మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె.. కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

  • హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ కొనాలన్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు
  • ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలు
  • అభివృద్ధి పనులకు డబ్బులేదు కానీ లగ్జరీ ప్రయాణాలు కావాల్సి వచ్చాయా అంటూ నిలదీత
వీఐపీల ప్రయాణం కోసం ఓ హెలికాప్టర్, మరో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదన చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉందని, త్వరలో టెండర్లు పిలుస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ కొనుగోలు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు, మరికొందరు మంత్రులకు అప్పగించారని ఆయన వివరించారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలపై తాము అధ్యయనం చేసి ముందుకువెళతామని తెలిపారు.
 
అయితే, ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓవైపు నిధులు లేక రాష్ట్రంలో అభివృద్ధి పనులు కుంటుపడగా.. మరోవైపు ప్రభుత్వ పెద్దలకు మాత్రం వీఐపీ ప్రయాణాలకు హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ కావాల్సి వచ్చాయని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నారని ఆరోపించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు అందక చాలామంది రోగులు ఆసుపత్రుల్లో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ కొనాలని ప్రభుత్వం నిర్ణయించడం విచారకరమని అన్నారు. ‘మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా ప్రభుత్వం తీరు ఉందని దుయ్యబడుతున్నారు.

More Telugu News