: ఝార్ఖండ్‌లో చోరీ అనుమానంతో మహిళపై అమానుష చర్య

  • మహిళ జుట్టు కత్తిరించి, మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించిన వైనం
  • గిరిడీహ్‌ జిల్లా డుమ్రీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఝార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీహ్‌ జిల్లా డుమ్రీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళపై జరిగిన అమానవీయ ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ఆభరణాలను అపహరించిందన్న అనుమానంతో ఓ మహిళను గ్రామస్థులు దారుణంగా చిత్రహింసలు పెట్టిన ఘటన తీవ్ర సంచలనం అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది.
 
వివరాల్లోకి వెళ్తే.. 36 ఏళ్ల మహిళ తమ ఆభరణాలు చోరీ చేసిందన్న నెపంతో గ్రామానికి చెందిన నాగేశ్వర్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పుల దండ వేసి, అర్ధనగ్నంగా గ్రామంలో ఊరేగించారు. స్థానికులు ఈ ఘటనను చూస్తూ వున్నారే తప్ప ఎవరూ అడ్డుకోలేదు. అయితే ఘటనను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. 
 
పోలీసులు స్పందన: 4 మంది అరెస్ట్

వైరల్ వీడియోల ఆధారంగా స్పందించిన డుమ్రీ పోలీసులు.. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడైన నాగేశ్వర్‌ యాదవ్‌ కుటుంబానికి చెందిన నలుగురు మహిళలను అరెస్టు చేశారు. మిగతా నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై డమ్రీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ప్రణీత్ పటేల్ స్పందిస్తూ .. ఆమె నగలు అపహరించినట్లు ఎటువంటి ఆధారం లేదని అన్నారు. అంతే కాకుండా బాధితురాలిపై గతంలో ఎటువంటి కేసులు కూడా లేవని వెల్లడించారు. 

More Telugu News