KCR: కేసీఆర్, హరీశ్ రావులకు ఊరటనిచ్చిన హైకోర్టు

KCR and Harish Rao Get Slight Relief from High Court
షార్ట్స్‌లో చూడండి
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల కేసును దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా ఏజీ స్పష్టం చేశారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ పిటిషన్‌పై లోతైన విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. వెకేషన్ అనంతరం దీనిపై విచారణ చేపడతామని పేర్కొంటూ, తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో కేసీఆర్, హరీశ్ రావులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. 
Go Back to Shorts
KCR
Kaleshwaram Project
Harish Rao
Telangana High Court
Justice PC Ghosh Commission
CBI Investigation
Telangana Government
BRS Party

More Telugu News