Revanth Reddy: కేటీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. 2029లో రాహుల్ ప్రధాని అని జోస్యం

Revanth Reddy Slams KTR Calls Him Mentally Ill
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ను ఒక మానసిక రోగిగా అభివర్ణించిన ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం యూరియాను ఒక కారణంగా చూపడం 'పిచ్చికి పరాకాష్ఠ' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

"యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అలాంటప్పుడు కేంద్రం యూరియా ఇస్తేనే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పడంలో అర్థమేముంది? అనవసరంగా ఈ నాటకాలెందుకు? నేరుగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తున్నామని చెప్పొచ్చు కదా" అని కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్లను 'అవయవదానం' చేసి బీజేపీని 8 స్థానాల్లో గెలిపించిందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహించే మెదక్‌లోనూ బీజేపీ గెలవడం బీఆర్ఎస్ పతనావస్థకు నిదర్శనమన్నారు.

గత ప్రభుత్వ హయాంలో తనను రాజకీయంగా దెబ్బతీయాలని అనేక ప్రయత్నాలు జరిగాయని రేవంత్ గుర్తుచేసుకున్నారు. "ఆయన రాజకీయ ప్రత్యర్థిని నేనేనని కేసీఆర్‌కు తెలుసు. అందుకే నాపై అక్రమంగా 181 కేసులు బనాయించారు. ఎన్నికల సమయంలో నా ఇంటిని కూల్చేసి, నన్ను కిడ్నాప్ చేశారు. కానీ ఆ కేసులే నాకు మెడల్స్ అయ్యాయి" అని ఆయన పేర్కొన్నారు.

30 రోజులకు మించి జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన కేంద్రం బిల్లును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, విపక్ష సీఎంలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ బిల్లు తెస్తున్నారని ఆరోపించారు. ఇక జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ తన రాజకీయ అంచనాలు ఎప్పుడూ తప్పలేదని "2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. ప్రధాని మోదీకి 2029 ఎక్స్‌పైరీ డేట్. ఈ విషయం రాసిపెట్టుకోండి" అన్నారు.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తాను చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. "చంద్రబాబు అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ఆయనను నేను గౌరవిస్తాను. కానీ నాకు నా పార్టీ, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం" అని స్పష్టం చేశారు. తాను విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశానే తప్ప, బీజేపీలో ఎన్నడూ పనిచేయలేదని, ఇప్పుడు తాను 'కాంగ్రెస్ యూనివర్సిటీ'లో ఉన్నానని రేవంత్ రెడ్డి వివరించారు.
Go Back to Shorts
Revanth Reddy
KTR
BRS
Telangana
Rahul Gandhi
2029 Elections
Telangana Politics
CM Revanth Reddy
Congress
NDAE

More Telugu News