Imran Khan: మే 9 అల్లర్ల కేసు: ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడికి జ్యుడీషియల్ రిమాండ్

Imran Khan Nephew Sher Shah Khan Remanded in May 9 Riots Case
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2023 మే 9న జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులో ఆయన మేనల్లుడు షేర్‌షా ఖాన్‌ను లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. కొద్ది రోజుల క్రితమే ఇమ్రాన్ మరో మేనల్లుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఐదు రోజుల ఫిజికల్ రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు గురువారం షేర్‌షా ఖాన్‌ను కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కోసం నిందితుడిని మరో 30 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అల్లర్ల సమయంలో తీసిన ఒక వీడియోలో షేర్‌షా, ఇమ్రాన్ మరో మేనల్లుడు అయిన హసన్ నియాజీతో కలిసి ఉన్నారని పోలీసులు తమ వాదన వినిపించారు.

అయితే, షేర్‌షా తరఫు న్యాయవాది సల్మాన్ అక్రమ్ రాజా ఈ వాదనను తోసిపుచ్చారు. కేవలం ఒక వీడియోలో కనిపించినంత మాత్రాన నేరం చేసినట్లు నిర్ధారించలేమని ఆయన అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, షేర్‌షా ఖాన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఆగస్టు 22న షేర్‌షా ఖాన్‌ను అరెస్ట్ చేయగా, అంతకు ఒక రోజు ముందు ఆయన సోదరుడు షాహ్రెజ్ ఖాన్‌ను కూడా జిన్నా హౌస్ దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ కుమారులు. దేశ వ్యతిరేక ప్రచారం చేయడం, మే 9 హింసలో పాల్గొనడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ అరెస్టులపై ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిమ్ ఖాన్, సోదరి అలీమా ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వ అణచివేతేనని, తమను భయపెట్టేందుకు అమాయక కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని వారు ఆరోపించారు.
Go Back to Shorts
Imran Khan
May 9 riots
Sher Shah Khan
Pakistan Tehreek-e-Insaf
Lahore anti terrorism court

More Telugu News