ఆలయం దాకా వెళ్లక్కర్లేదు.. ఉత్తరం రాస్తే చాలు కోర్కెలు తీర్చే వినాయకుడు
- రాజస్థాన్ లోని రణథంబోర్ లో త్రినేత్ర గణేశుడి ఆలయం
- ఆరావళి, వింధ్య పర్వతాల్లో రాజుల కాలంలో నిర్మాణం
- రోజూ వేలాదిగా స్వామి వారికి ఉత్తరాలు, శుభలేఖలు
ఆరావళి, వింధ్య పర్వతాల్లో పదో శతాబ్దంలో అప్పటి రణథంబోర్ పాలకుడు మహారాజా హమ్మిరదేవ ఈ ఆలయాన్ని నిర్మించారు. అల్లాఉద్దీన్ ఖిల్జీతో యుద్ధం జరుగుతున్న సమయంలో రాజుగారి కలలోకి వినాయకుడు వచ్చి ఖిల్జీపై విజయం సాధించేందుకు సాయం చేశాడట. దీంతో మహారాజా హమ్మిరదేవ తన కోటలోనే త్రినేత్ర వినాయకుడి ఆలయం నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడి భార్యలు రిద్ది, సిద్ధి, కుమారులు శుభ్, లాభ్ ఒకేచోట వెలిశారు.
కోర్కెలను చెప్పుకోవడంతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరు కావాలంటూ వినాయకుడికి ఆహ్వాన లేఖలు కూడా పంపిస్తారు. త్రినేత్ర గణేశుడి ఆలయం, రణథంబోర్ గ్రామం, సవాయ్ మధోపుర్ జిల్లా, పిన్ కోడ్ 322021 చిరునామాకు నిత్యం వందలాది ఉత్తరాలు వస్తుంటాయని ఆలయ పండితులు తెలిపారు.