Rajasthan: సుప్రీంకోర్టు ఆదేశాలతో వీధి కుక్కలపై రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం

Rajasthan becomes first state to implement Supreme Courts order on stray dogs
  • వీధి కుక్కల నిర్వహణపై రాజస్థాన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు
  • దేశంలోనే తొలిసారిగా సమగ్ర ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడి
  • ప్రతీ వార్డులో కుక్కల కోసం ప్రత్యేక ఫీడింగ్ పాయింట్ల ఏర్పాటు
  • స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కేంద్రాలు
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త నిబంధనలు
వీధి కుక్కల నిర్వహణ విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం దేశంలోనే ఒక ముందడుగు వేసింది. ప్రజల భద్రత, మూగజీవాల సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, రాష్ట్రంలోని ప్రతీ వార్డులో, ప్రతీ కాలనీలో వీధి కుక్కల కోసం ప్రత్యేక ఫీడింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు స్వయం పరిపాలన విభాగం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిళ్లు, మున్సిపాలిటీలకు కఠిన ఆదేశాలు పంపింది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) రూల్స్ 2023ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, జంతు సంక్షేమ సంస్థల సహకారంతో ఈ ఫీడింగ్ పాయింట్లను గుర్తించాలని సూచించింది. రేబిస్ సోకిన కుక్కలకు కూడా ఈ కేంద్రాల్లో ఆహారం, నీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

స్థానిక స్వపరిపాలన శాఖ కార్యదర్శి రవి జైన్ మాట్లాడుతూ, "సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రజల భద్రత, జంతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంత సమగ్రమైన ఉత్తర్వులు జారీ చేసిన తొలి రాష్ట్రం రాజస్థాన్" అని తెలిపారు. అన్ని మున్సిపల్ సంస్థలు 30 రోజుల్లోగా తమ నివేదికలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.

కొత్త నిబంధనల ప్రకారం ప్రతీ నగరంలో స్టెరిలైజేషన్, రేబిస్ వ్యాక్సినేషన్, డీవార్మింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీధి కుక్కలకు చికిత్స, స్టెరిలైజేషన్ చేసి, ట్యాగ్ వేసి వాటిని పట్టుకున్న ప్రాంతంలోనే తిరిగి వదిలిపెట్టాలి. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం ఆపరేషన్ థియేటర్లు, ఏబీసీ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. శిక్షణ పొందిన బృందాలు మాత్రమే వలలతో లేదా చేతులతో కుక్కలను పట్టుకోవాలని, ఆరు నెలలలోపు వయసున్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేయరాదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతీ నగరంలో ఎన్జీవో సభ్యులు, జంతు సంక్షేమ కార్యకర్తలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. స్టెరిలైజేషన్లు, వ్యాక్సినేషన్లు, మరణాలు, ఫీడింగ్ వివరాల రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఒక కుక్కను పట్టుకోవడానికి రూ. 200, స్టెరిలైజేషన్, ఆహారం, సంరక్షణకు రూ. 1,450 చొప్పున ఖర్చును నిర్ణయించారు.
Rajasthan
street dogs
animal birth control
ABC rules 2023
dog feeding points
animal welfare
rabies vaccination
dog sterilization
Ravi Jain
municipal corporations

More Telugu News