Suravaram Sudhakar Reddy: సురవరం సుధాకర్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Announces Decision to Immortalize Suravaram Sudhakar Reddys Name
షార్ట్స్‌లో చూడండి
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. నిరుపేదలు, బహుజనుల పక్షాన నిలిచిన గొప్ప నేతను కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో ఉంచిన సురవరం సుధాకర్ రెడ్డి పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సీపీఐ జాతీయ నాయకులు డి. రాజా, కె. నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషాతో మాట్లాడి సురవరం గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి జాతీయ రాజకీయాల వరకు ఒకే సిద్ధాంతంతో, నిరాడంబరంగా జీవించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినా ఏనాడూ అహంకారం దరిచేరనీయలేదు. పాలమూరు బిడ్డగా బూర్గుల, జైపాల్ రెడ్డిల కోవలో ఆయన జిల్లాకు ఎంతో పేరు తెచ్చారు,” అని కొనియాడారు.

సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలని గతంలో సుధాకర్ రెడ్డి కోరగానే తక్షణమే అమలు చేశామని సీఎం గుర్తుచేశారు. “విలువలతో కూడిన నాయకులను గౌరవించుకోవడంలో మా ప్రభుత్వం ముందుంటుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, గద్దర్, జైపాల్ రెడ్డిల పేర్లను చిరస్థాయిగా నిలిపాం. అదే విధంగా సుధాకర్ రెడ్డి గారిని కూడా శాశ్వతంగా గుర్తుంచుకునేలా సముచిత నిర్ణయం తీసుకుంటాం,” అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తన సంతాప సందేశాన్ని పంపినట్లు సీఎం తెలిపారు.
Go Back to Shorts
Suravaram Sudhakar Reddy
Revanth Reddy
CPI
Telangana
Condolences
D Raja
K Narayana
Kunamaneni Sambasiva Rao
Telangana Politics

More Telugu News