మీ వద్ద కొత్త ఐడియా ఉంటే, దాన్ని అభివృద్ది చేసే వేదిక ఏపీ: సీఎం చంద్రబాబు
- మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్న సీఎం చంద్రబాబు
- 'ఇంటికి ఒక పారిశ్రామికవేత్త' లక్ష్యంగా కొత్త పిలుపు
- ఆవిష్కరణలకు మెంటరింగ్, ఫండింగ్తో పూర్తి ప్రోత్సాహం
- ప్రారంభోత్సవంలో పాల్గొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, వినూత్న ఆలోచనలకు ఊతమివ్వడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తెలిపారు. "ఆలోచనలపై పెట్టే పెట్టుబడి, మౌలిక వసతులపై పెట్టే పెట్టుబడితో సమానం. అందుకే రాష్ట్రంలో ఆవిష్కరణలకు అనువైన ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సరికొత్త ఐడియాలకు చేయూతనిచ్చి, వాటిని విజయవంతమైన వ్యాపారాలుగా మార్చేందుకు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక వేదికగా నిలుస్తుంది" అని ఆయన వివరించారు. ఈ హబ్ ద్వారా అద్భుతమైన ఆలోచనలకు అవసరమైన మార్గనిర్దేశం (మెంటరింగ్), నిధులు (ఫండింగ్), సరైన గుర్తింపు లభిస్తాయని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఒక కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. "గతంలో 'ఇంటికి ఒక ఐటీ నిపుణుడు' అనే నినాదం ఇచ్చాను. ఇప్పుడు టెక్నాలజీ మారింది, ప్రపంచం మారింది. అందుకే నేడు 'ఇంటికి ఒక పారిశ్రామికవేత్త' అనే కొత్త పిలుపునిస్తున్నాను. ప్రతి కుటుంబం కలలు కనాలి, వాటిని నిర్మించుకోవాలి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలి" అని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం ద్వారా కేవలం స్టార్టప్లను ప్రోత్సహించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమానికి పునాది వేస్తున్నామని అన్నారు. ఆవిష్కరణలతో పాటు సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచిన గొప్ప దార్శనికుడు రతన్ టాటా స్ఫూర్తితో ఈ హబ్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకునేందుకు విచ్చేసిన టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్కు, ఇతర ప్రముఖులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.