నిజామాబాద్లో గూఢచారి పావురం కలకలం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నిజామాబాద్ జిల్లా బోధన్లో పావురం కలకలం
- బాలుడికి అనుమానాస్పదంగా దొరికిన పక్షి
- పావురం కాలికి కోడ్ రింగ్, రెక్కలపై అక్షరాలు
- గూఢచారి పావురంగా అనుమానిస్తున్న గ్రామస్తులు
- పావురాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బోధన్ మండలం, భవానిపేట గ్రామంలో ఒక మైనర్ బాలుడికి ఈ పావురం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. దానిని పట్టుకుని పరిశీలించగా, దాని కాలికి ఒక రింగ్, రెక్కల కింద కొన్ని అక్షరాలు ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తుల దృష్టికి తీసుకువెళ్ళాడు. పావురాన్ని చూసిన గ్రామస్తులు అది సాధారణ పావురం కాదని, గూఢచర్యం కోసం వాడే పక్షి కావచ్చని అనుమానించారు.
గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన గ్రామానికి చేరుకున్న పోలీసులు పావురాన్ని పరిశీలించారు. కాలికి రింగ్, రెక్కలపై అక్షరాలు ఉండటాన్ని గుర్తించారు. ఆ పావురాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ పావురం ఎక్కడి నుంచి వచ్చింది? దాని కాలికి ఉన్న రింగ్లోని కోడ్, రెక్కలపై ఉన్న అక్షరాల అర్థం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.