సినీ కార్మికుల సమ్మె.. రంగంలోకి చిరంజీవి

  • ప్రతి యూనిట్‌తో విడివిడిగా మాట్లాడిన చిరంజీవి
  • వేతనాలు పెంచాలని కోరుతూ 15 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు
  • చిరంజీవి తమను పిలిచి మాట్లాడారన్న ఫెడరేషన్ అధ్యక్షుడు
సినీ కార్మికుల సమ్మె వ్యవహారంలో మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకున్నారు. ఆయన ఫెడరేషన్ సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రతి యూనియన్‌తో విడివిడిగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రం సినీ కార్మికుల ఫెడరేషన్‌తో ఫిలిమ్ ఛాంబర్ సమావేశం కానుంది.

చిరంజీవి మమ్మల్ని పిలిచి మాట్లాడారు

చిరంజీవితో సమావేశం అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మీడియాతో మాట్లాడుతూ, కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ తాము 15 రోజులుగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఈరోజు చిరంజీవి తమను పిలిచి మాట్లాడారని వెల్లడించారు. 24 విభాగాల నుంచి 72 మందితో ఆయన చర్చించారని తెలిపారు.

నిర్మాతలు తాము చెప్పేది వినకుండా తమ మీదే నిందలు వేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకు వెళ్లామని ఆయన తెలిపారు. సాధ్యం కాని, అమలు చేయలేని నిబంధనలు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులతో పాటు నిర్మాతలు కూడా బాగుండాలని, కానీ నిర్మాతలు పెట్టిన రెండు షరతులకు తాము ఒప్పుకుంటే నష్టపోతామని అనిల్ అన్నారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.

'మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి' అని చిరంజీవి తమకు భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. మంగళవారం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఛాంబర్ నుంచి కూడా తమకు పిలుపు వచ్చిందని అన్నారు. చర్చలకు పిలిచారు కాబట్టి తాము ప్రస్తుతానికి నిరసన కార్యక్రమం ఆపేశామని తెలిపారు. తాము అడిగినట్లు వేతనాలు వస్తాయని భావిస్తున్నామని అన్నారు.


More Telugu News