వర్షంలో రాహుల్ గాంధీకి కాస్త దూరంలో కనిపించిన జగదీశ్ టైట్లర్.. బీజేపీ ఆగ్రహం

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక ఫోటో రాజకీయ దుమారాన్ని రేపింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగదీశ్ టైట్లర్‌తో ఆయన కలిసి కనిపించడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

శుక్రవారం ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వర్షం పడుతుండగా, రాహుల్ గాంధీకి కాస్త దూరంలో జగదీశ్ టైట్లర్ గొడుగు కింద ఉన్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఫోటోను ఉటంకిస్తూ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై, గాంధీ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ మంత్రి, బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. 1984 సిక్కుల ఊచకోతను, యూదులు ఊచకోత ‘హోలోకాస్ట్’తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ, జగదీశ్ టైట్లర్ కలిసి నిలబడటం అంటే హిట్లర్, హోలోకాస్ట్ సూత్రధారి హిమ్లర్ కలిసి పోజు ఇచ్చినట్లే ఉంది. తన వారిని కాపాడుకోవడానికే హిట్లర్ హంతకుల పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు రాహుల్ కూడా అదే సందేశం ఇస్తున్నారు. 1984లో వేలాది మంది సిక్కులను చంపడం కాంగ్రెస్‌కు ఒక మచ్చ కాదు, వారు గర్వంగా ధరించే బ్యాడ్జ్!" అని సిర్సా 'ఎక్స్' వేదికగా విమర్శించారు.

మరో బీజేపీ నేత అమిత్ మాలవీయ కూడా దీనిపై స్పందిస్తూ, "రాజీవ్ గాంధీ ప్రోద్బలంతో సిక్కులపై మారణహోమం సృష్టించిన జగదీశ్ టైట్లర్ మరోసారి రాహుల్ పక్కన కనిపించారు. కొన్ని మరకలు ఎంతకాలమైనా పోవు. గాంధీ కుటుంబం క్షమాపణ చెప్పే రకం కాదు" అని పేర్కొన్నారు.

1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లలో 3,000 మందికి పైగా సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ముగ్గురు సిక్కులను ఓ గుంపు దారుణంగా హత్య చేసిన ఘటనలో టైట్లర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ కోర్టులో విచారణ దశలో ఉంది. వంద మంది సిక్కులను తానే చంపినట్లు టైట్లర్ అంగీకరించినట్లు ఆరోపణలున్న ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోను కూడా బాధితుల తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. తాజా ఫోటోతో 1984 నాటి గాయాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Jagdish Tytler
Rahul Gandhi
1984 Sikh riots
Indian National Congress
BJP
Manjinder Singh Sirsa

More Telugu News