NPCI: అక్టోబర్ 1 నుంచి యూపీఐలో ఈ ఫీచర్ కనుమరుగు.. ఎందుకంటే?

NPCI to Remove UPI Collect Request Feature from October 1
  • యూపీఐ యాప్‌లలో 'కలెక్ట్ రిక్వెస్ట్' ఫీచర్ రద్దు
  • అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు
  • ఆర్థిక మోసాలను అరికట్టేందుకే ఈ కీలక నిర్ణయం
  • ఆదేశాలు జారీ చేసిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
  • డబ్బు పంపాలంటే క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ నంబర్ తప్పనిసరి
మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను నిత్యం వాడుతున్నారా? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. ఆన్‌లైన్ మోసాలను నివారించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ యాప్‌లలో విస్తృతంగా ఉపయోగించే ‘కలెక్ట్ రిక్వెస్ట్’ లేదా పీర్-టు-పీర్ (P2P) మనీ రిక్వెస్ట్ ఫీచర్‌ను పూర్తిగా తొలగించనుంది. ఈ నూతన నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఎందుకీ మార్పు?

స్నేహితులు లేదా ఇతరుల నుంచి డబ్బులు స్వీకరించాల్సిన సమయంలో, వారికి రిమైండర్ పంపేందుకు 'కలెక్ట్ రిక్వెస్ట్' ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, సైబర్ నేరగాళ్లు ఇదే ఫీచర్‌ను ఆసరాగా చేసుకొని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఏదో ఒక అత్యవసర పరిస్థితి లేదా నకిలీ కారణం చూపి యూజర్లకు మనీ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. విషయం తెలియక చాలామంది ఆ రిక్వెస్ట్‌ను ఆమోదించి, తమ యూపీఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులు నష్టపోతున్నారు.

ఇలాంటి ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడానికే ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ తరహా లావాదేవీలపై రూ. 2,000 పరిమితి విధించినప్పటికీ మోసాలు ఆగలేదు. అందుకే, వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ ఫీచర్‌నే పూర్తిగా తొలగించాలని జూలై 29న జారీ చేసిన సర్క్యులర్‌లో ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

ఇకపై డబ్బు పంపడం ఎలా?

అక్టోబర్ 1 నుంచి వ్యక్తుల మధ్య డబ్బును అభ్యర్థించే 'కలెక్ట్ రిక్వెస్ట్' ఆప్షన్ పనిచేయదు. వినియోగదారులు నేరుగా అవతలి వ్యక్తి ఫోన్ నంబర్‌ను ఎంచుకొని లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఇది సురక్షితమైన పద్ధతి అని ఎన్‌పీసీఐ భావిస్తోంది.

వ్యాపార సంస్థలకు మినహాయింపు

అయితే, ఈ కొత్త నిబంధన వ్యాపార లావాదేవీలకు వర్తించదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు తమ కస్టమర్లకు పేమెంట్ పూర్తిచేయమని కలెక్ట్ రిక్వెస్ట్‌లు పంపవచ్చు. వినియోగదారులు ఆ రిక్వెస్ట్‌ను ఆమోదించి, తమ యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.
NPCI
UPI collect request
UPI
digital payments
online fraud
cyber crime
money transfer
peer to peer payments

More Telugu News