Ram Gopal Varma: ఫొటో మార్ఫింగ్ కేసు.. ఆర్జీవీకి 12 గంటల పాటు పోలీసుల ప్రశ్నల వర్షం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఫొటో మార్ఫింగ్ కేసుకు సంబంధించి నిన్న ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను ఏకధాటిగా దాదాపు 12 గంటల పాటు విచారించారు. ఉదయం 11:30 గంటలకు మొదలైన విచారణ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. విచారణ ప్రారంభానికి ముందే ఈ కేసులో అత్యంత కీలకమైన ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గత ఏడాది 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణలపై గత ఏడాది నవంబర్‌లో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే వర్మను ఒంగోలుకు పిలిచారు. 

విచారణ అధికారి, ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు.. వర్మను దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ ఫొటోల మార్ఫింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దానిపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అయితే, వర్మ కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చి, పలు కీలక ప్రశ్నలకు మౌనం వహించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇదే కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఒకసారి వర్మను విచారించారు. ఆ సమయంలో సెల్‌ఫోన్ తీసుకురాలేదని ఆయన చెప్పడంతో, ఈసారి తప్పనిసరిగా ఫోన్‌తో హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన విచారణకు రాగా, పోలీసులు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ విచారణ అనంతరం వర్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Ram Gopal Varma
RGV
Photo morphing case
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Andhra Pradesh Politics
Vyuham movie
Ongole police
Social media

More Telugu News