బెంగళూరులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో కలిసి ప్రధాని మోదీ మెట్రో రైడ్

  • బెంగళూరు ఎల్లో లైన్ మెట్రో ప్రారంభోత్సవంలో ఆసక్తికర దృశ్యం
  • ప్రధాని మోదీతో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఆప్యాయ సంభాషణ
  • మెట్రోలో ప్రధానికి ఇరువైపులా కూర్చుని ముచ్చటించిన కాంగ్రెస్ నేతలు
  • రాజకీయ విమర్శలు పక్కనపెట్టి నవ్వుతూ కనిపించిన నేతలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు
  • టెక్ హబ్ ఎలక్ట్రానిక్స్ సిటీని కలుపుతూ ఎల్లో లైన్ మెట్రో ప్రారంభం
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తరచూ తీవ్ర విమర్శలు చేసే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు... ఆయనతో ఎంతో ఆప్యాయంగా, నవ్వుతూ మాట్లాడటం విశేషం. బెంగళూరులో జరిగిన మెట్రో ప్రారంభోత్సవ వేడుక ఈ అరుదైన సన్నివేశానికి వేదికైంది.

ఆదివారం నాడు బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో సేవల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌వీ రోడ్ మెట్రో స్టేషన్‌లో ప్రధానికి స్వాగతం పలికిన సీఎం సిద్ధరామయ్య.. పుష్పగుచ్ఛం అందిస్తూ ఆయన చేతిని పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అయితే, ప్రాజెక్టు వివరాలను ప్రధానికి ఎంతో ఉత్సాహంగా వివరించారు. కార్యక్రమం పూర్తయ్యాక ముగ్గురు నేతలు కలిసి కొత్త మెట్రో రైలులో ప్రయాణించారు.

ఆర్‌వీ రోడ్ స్టేషన్ నుంచి బొమ్మనహళ్లి వరకు సాగిన 19.15 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ప్రధాని మోదీకి ఇరువైపులా సిద్ధరామయ్య, శివకుమార్‌లు కూర్చున్నారు. ప్రయాణమంతా ముగ్గురూ ఎంతో సరదాగా ముచ్చటించుకున్నారు. డీకే శివకుమార్ మెట్రో రైలు నుంచి బయటకు చూపిస్తూ ప్రధానికి పలు విషయాలు వివరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. నేతల మధ్య నవ్వులు విరిశాయి. రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి వారు ఇలా కలిసిపోయి ముచ్చటించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ఎల్లో లైన్ మెట్రో సేవలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్గం బెంగళూరు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ను టెక్ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీతో కలుపుతుంది. ప్రధానితో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16 మంది విద్యార్థినులు, 8 మంది చిన్నారులు, 8 మంది మెట్రో కార్మికులకు ఈ రైలులో ప్రయాణించే అవకాశం దక్కింది. ప్రయాణంలో వారితో కూడా ప్రధాని ముచ్చటించారు.


More Telugu News