ఎస్‌బీఐకి జాక్‌పాట్.. కోటి రూపాయల పెట్టుబడితో రూ.7,800 కోట్ల లాభం!

  • ఎన్‌ఎస్‌డీఎల్‌లో పెట్టుబడితో ఎస్‌బీఐకి భారీ జాక్‌పాట్
  • రూ.1.20 కోట్ల పెట్టుబడి విలువ రూ.7,801 కోట్లకు చేరిక
  • కేవలం మూడు రోజుల్లోనే 6,50,000 శాతం రాబడి
  • స్టాక్ మార్కెట్ లిస్టింగ్ తర్వాత షేరు ధరలో భారీ పెరుగుదల
  • ఐడీబీఐ, ఎన్‌ఎస్‌ఈ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు కూడా భారీ లాభాలు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు ఊహించని జాక్‌పాట్ తగిలింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్)లో పెట్టిన చిన్న పెట్టుబడి, ఇప్పుడు ఆ బ్యాంకుకు సిరుల పంట పండించింది. కేవలం రూ.1.20 కోట్లతో కొనుగోలు చేసిన వాటా విలువ, స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన మూడంటే మూడు రోజుల్లోనే ఏకంగా రూ.7,801 కోట్లకు చేరడం సంచలనం సృష్టిస్తోంది.

ఎన్‌ఎస్‌డీఎల్ కంపెనీ ఆగస్టు 8న స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేసింది. ఇష్యూ ధర రూ.800 కాగా, 10 శాతం ప్రీమియంతో రూ.880 వద్ద లిస్ట్ అయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ షేరు, కేవలం 72 గంటల్లోనే రూ.1,300.30 స్థాయికి దూసుకెళ్లింది. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే 62.5 శాతం వృద్ధి నమోదైంది.

ఈ భారీ లాభాలతో అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందింది ఎస్‌బీఐ. చాలా సంవత్సరాల క్రితం, ఎస్‌బీఐ కేవలం రూ.2 చొప్పున 60 లక్షల ఎన్‌ఎస్‌డీఎల్ షేర్లను కొనుగోలు చేసింది. దీని కోసం అయిన ఖర్చు కేవలం రూ.1.20 కోట్లు మాత్రమే. నేడు ఆ వాటా విలువ రూ.7,801.80 కోట్లకు పెరిగింది. అంటే, ఎస్‌బీఐకి కాగితాలపైనే (పేపర్ ప్రాఫిట్) రూ.7,800.60 కోట్ల లాభం వచ్చినట్టు. ఇది దాదాపు 6,50,050 శాతం రాబడి కావడం గమనార్హం.

ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు కూడా భారీ లాభాలను ఆర్జించాయి. ఐడీబీఐ బ్యాంక్ కూడా రూ.2 చొప్పున రూ.5.99 కోట్లతో కొన్న వాటా విలువ ఇప్పుడు రూ.3,898 కోట్లకు చేరింది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యూయూటీఐ) రూ.2.04 కోట్లతో కొన్న షేర్ల విలువ రూ.1,332 కోట్లకు పెరిగింది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) రూ.12.28 చొప్పున పెట్టిన రూ.36.84 కోట్ల పెట్టుబడి, ఇప్పుడు 105 రెట్లు పెరిగి రూ.3,900 కోట్లకు చేరింది. అదేవిధంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.150.54 కోట్ల పెట్టుబడిపై రూ.1,507 కోట్ల లాభం పొందగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2.66 కోట్ల పెట్టుబడిపై రూ.664 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తంగా ఎన్‌ఎస్‌డీఎల్ లిస్టింగ్ దాని ప్రారంభ పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపించింది.


More Telugu News