బుల్లితెరపై అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ నాదే: స్మృతి ఇరానీ

  • మళ్లీ టెలివిజన్ రంగంలోకి వస్తున్న స్మృతి ఇరానీ 
  • ‘క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2’ తో రీ ఎంట్రీ 
  • ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల రెమ్యునరేషన్‌
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఒకప్పుడు టెలివిజన్ రంగంలో తిరుగులేని నటి అని తెలిసిందే. ఓ మోడల్ గా కెరీర్ ప్రారంభించి, ఆపై బుల్లితెరపై స్టార్ గా ఎదిగారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె మళ్లీ పాత కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా బుల్లితెరపై రీ-ఎంట్రీ ఇచ్చారు. ‘క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2’ అనే ధారావాహికలో ప్రధాన పాత్రలో నటిస్తున్న స్మృతి ఇరానీ, ఒక్కో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు నెట్టింట వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన స్మృతి, బుల్లితెరలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటి తానే అని అంగీకరించారు.

‘‘ఈ సీరియల్‌ గతంలో ప్రేక్షకాదరణ, రేటింగ్‌లలో టాప్‌లో ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కోరినంత రెమ్యునరేషన్‌ ఇస్తారు. నటీనటులుగా మేము కాంట్రాక్టర్స్‌తో ఒప్పందం చేసుకుంటాం. ఆ వివరాలు బయటకు చెప్పలేం. నేను ఈ ఇండస్ట్రీలో భాగమైనందున నాకూ ఓ నంబర్‌ ఉంటుంది. ఆ ఆధారంగానే పారితోషికం తీసుకుంటాను. అయితే, రెమ్యునరేషన్‌ విషయంలో నేను ఇతర నటీనటులను మించాను. నన్ను చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. ఇది కేవలం నటన మాత్రమే కాదు, ఓ బాధ్యత’’ అని స్మృతి ఇరానీ వెల్లడించారు.

ఈ సీరియల్‌లో ఇతర నటీమణులైన రూపాలి గంగూలీ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 లక్షలు, హీనా ఖాన్‌ రూ.2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. 25 ఏళ్ల క్రితం స్మృతి నటించిన ‘క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ’ హిందీ సీరియల్‌ 2000 నుంచి 2008 వరకు విజయవంతంగా ప్రసారమైంది. అందులో తులసి పాత్రలో ఆమె నటనకు ఎన్నో అవార్డులు లభించాయి. ప్రస్తుతం ఈ సీరియల్‌ రెండో భాగం జియో సినిమా, స్టార్‌ప్లస్‌లలో ప్రసారమవుతోంది.


More Telugu News