Rohit Sharma: అభిమానులకు నిరాశ.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ మరింత ఆలస్యం

Rohit Sharma Virat Kohli Comeback Delayed After This Big Request From Current Players
  • భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన సిరీస్ రద్దు
  • ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్ తర్వాత ఆటగాళ్లకు పూర్తి విశ్రాంతి
  • సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పునరాగమనం మ‌రింత‌ ఆలస్యం
  • అక్టోబర్‌లోని ఆస్ట్రేలియా సిరీస్‌తో తిరిగి బరిలోకి దిగనున్న సీనియర్లు
  • సెప్టెంబర్ 9 నుంచి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌లో ఆడనున్న టీమిండియా
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ అనంతరం ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఆగస్టులో శ్రీలంకతో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ రద్దయింది. ఫలితంగా రోహిత్, కోహ్లీల రీఎంట్రీ అక్టోబర్‌కు వాయిదా పడింది.

ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ సిరీస్ తర్వాత, ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ 2026 సెప్టెంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఖాళీ సమయంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ నిర్వహించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ సిరీస్‌తోనే ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన రోహిత్, కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తారని అందరూ భావించారు.

అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లోని ప్రతీ మ్యాచ్ ఐదో రోజు వరకు సాగడంతో ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసిపోయారు. ఈ నేపథ్యంలో తమకు విశ్రాంతి కావాలని ఆటగాళ్లు బీసీసీఐని కోరినట్లు సమాచారం. "ఇంగ్లండ్ సిరీస్ తర్వాత ఆటగాళ్లు విరామం కోరారు. సెప్టెంబర్ నుంచి టీమిండియాకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో ఆటగాళ్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు, వారికి పూర్తి విశ్రాంతినిస్తూ శ్రీలంక సిరీస్‌ను రద్దు చేసింది.

ఈ నిర్ణయంతో టీమిండియా తదుపరి సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఇక రోహిత్, కోహ్లీల పునరాగమనం అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తోనే సాధ్యం కానుంది.

ఇదే విషయంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, యువ ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసించారు. "భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదు. ఇక్కడ ప్రతిభకు కొదవలేదు. యువ ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. గవాస్కర్ తర్వాత సచిన్ వచ్చాడు. వారి తర్వాత ద్రావిడ్, సెహ్వాగ్, లక్ష్మణ్ వచ్చారు. ఇప్పుడు కోహ్లీ తర్వాత యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ వంటి వాళ్లు ముందుకొచ్చారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ వంటి బలమైన వ్యవస్థల వల్ల భారత క్రికెట్ ఎదుగుతూనే ఉంటుంది" అని దాదా పేర్కొన్నారు.
Rohit Sharma
Virat Kohli
India cricket
BCCI
Asia Cup
Australia series
Indian team
Yashasvi Jaiswal
Shubman Gill
Saurav Ganguly

More Telugu News