కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వం: పొన్నం ప్రభాకర్

Kishan Reddys conspiracies will not succeed says Ponnam Prabhakar
  • బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడతామన్న పొన్నం ప్రభాకర్
  • ముస్లింల పేరుతో అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్య
  • ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో బీజేపీని బీసీలు తిరస్కరించారన్న పొన్నం
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ధర్నా శిబిరానికి ఢిల్లీలోని పలువురు పార్టీ పెద్దలు తరలి వచ్చారు. 

కాసేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడతామని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వబోమని అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుపై తీర్మానం చేసే సందర్భంలోనే కిషన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పి ఉంటే... ఆరోజు చర్చ జరిగేదని చెప్పారు. ఆ బిల్లు చట్ట రూపం దాల్చి, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి వచ్చిన తర్వాత... ముస్లింల పేరుతో దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. కిషన్ రెడ్డిని కూడా బహిరంగ చర్చకు ఆహ్వానించదలుచుకున్నామని చెప్పారు. 

లోక్ సభ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా బీజేపీ గెలిచిందని పొన్నం ఎద్దేవా చేశారు. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో బీజేపీని బీసీలు తిరస్కరించారని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Kishan Reddy
Ponnam Prabhakar
BC Reservations
Telangana Congress
Revanth Reddy
Jantar Mantar
Delhi
BC Bill
BJP
Lok Sabha Elections

More Telugu News