ఆహారం తింటున్న సింహాన్ని వీడియో కోసం కవ్వించాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

  • గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో ఘటన
  • యువకుడిపైకి దూసుకొచ్చిన సింహం 
  • ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ యువకుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల తీవ్ర విమర్శలు
సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు యువకులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా గుజరాత్‌లో ఓ యువకుడి తాలూకు ఘ‌ట‌న‌ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆహారం తింటున్న సింహానికి అత్యంత సమీపంగా వెళ్లి వీడియో తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అడవిలో ఒక సింహం తాను వేటాడిన జంతువును తింటోంది. ఆ సమయంలో ఓ యువకుడు తన ఫోన్ చేతిలో పట్టుకుని నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్లాడు. ఆ మృగరాజుతో ఓ క్లోజప్ వీడియో తీయాలన్నది అతని ఉద్దేశం. మొదట తన ఆహారంలో నిమగ్నమైన సింహం, కాసేపటికి తన దగ్గరికి వస్తున్న వ్యక్తిని గమనించింది.

వెంటనే తీవ్ర ఆగ్రహానికి లోనైన సింహం, పెద్దగా గర్జిస్తూ ఆ యువకుడి వైపు దూసుకొచ్చింది. దీంతో భయపడిపోయిన ఆ యువకుడు, నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ అక్కడి నుంచి తప్పుకున్నాడు. అదృష్టవశాత్తూ సింహం తన ఆహారం వద్దకు తిరిగి వెళ్లిపోవడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు భయంతో కేకలు వేయడం వీడియోలో వినిపించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వడంతో వైర‌ల్‌గా మారింది. నెటిజన్లు ఆ యువకుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇలాంటి మూర్ఖపు పనులు చేయడం సరికాదని మండిపడుతున్నారు. వన్యప్రాణులు, ముఖ్యంగా సింహం వంటి క్రూర మృగాల వద్ద అత్యంత జాగ్రత్తగా మెలగాలని, వాటి సహజ ఆవాసాలకు భంగం కలిగించవద్దని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.


More Telugu News