బహదూర్‌పల్లిలో ప్లాట్ల వేలం... రూ.100 కోట్ల ఆదాయం!

  • బహదూర్‌పల్లిలో ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించిన రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ 
  • 68 ప్లాట్లకు మంగళవారం వేలం నిర్వహణ
  • గరిష్ఠంగా చదరపు గజానికి రూ.46,500లు ధర  
ప్లాట్ల బహిరంగ వేలం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సుమారు వంద కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లిలోని ప్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా విక్రయించింది. దీని ద్వారా సుమారు రూ.100 కోట్ల ఆదాయం వచ్చినట్లు కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు.

బహదూర్‌పల్లిలోని 68 ప్లాట్లకు నిన్న బహిరంగ వేలం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 119 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారు.

దాదాపు 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో కార్నర్ ప్లాట్లకు రూ.30 వేలు, ఇతర ప్లాట్‌లకు రూ.27 వేలు గజం చొప్పున అప్‌సెట్ ధర నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ కోసం 30 మంది పోటీ పడ్డారు. గరిష్ఠంగా చదరపు గజానికి రూ.46,500 ధర పలికింది.

నేడు రంగారెడ్డి జిల్లా తొర్రూర్ లో బహిరంగ వేలం

నేడు (బుధవారం) రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలోని ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. 


More Telugu News