శిక్షణ పూర్తి చేసుకున్న ఏడుగురు ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ సర్కార్

  • 2023 బ్యాచ్‌‌కు చెందిన ఏడుగురు ప్రొబేషన్ ఐఏఎస్‌లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్
  • ఈ నెల 11న విధుల్లో చేరాలని ఆదేశాలు
రెండో దశ శిక్షణ పూర్తి చేసుకున్న 2023 బ్యాచ్‌కు చెందిన ఏడుగురు ఐఏఎస్ ప్రొబేషన్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ జిల్లాల్లో సబ్ కలెక్టర్లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న వీరంతా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మదనపల్లె సబ్ కలెక్టర్‌గా చల్లా కల్యాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పని చేస్తున్న వై. మేఘస్వరూప్‌ను బదిలీ చేసింది. కందుకూరు రెవెన్యూ సబ్ డివిజన్‌కు సబ్ కలెక్టర్‌గా దామెర హిమవంశీని నియమించి, అక్కడ పని చేస్తున్న తిరుమాని శ్రీపూజను బదిలీ చేసింది. పాలకొండ సబ్ డివిజన్‌కు సబ్ కలెక్టర్‌గా పవార్ స్వప్నిక్ జగన్నాథ్‌ను నియమిస్తూ సి. యశ్వంత్ కుమార్ రెడ్డిని బదిలీ చేసింది.

నూజివీడు సబ్ కలెక్టర్‌గా బొల్లిపల్లి వినూత్న నియమితులయ్యారు. బచ్చు స్మరణ్ రాజ్ ను అక్కడి నుంచి బదిలీ అయ్యారు. రాజంపేట సబ్ కలెక్టర్‌గా హెచ్.ఎస్. భావన నియమితులయ్యారు. అక్కడ పని చేస్తున్న వైకోమ్ నైదియా దేవిని బదిలీ చేశారు. రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం నొఖ్వాల్‌ను నియమిస్తూ, అక్కడ పని చేస్తున్న కల్పశ్రీ కె.ఆర్. ను బదిలీ చేసింది. పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా ఆర్. వైశాలిని నియమించిన ప్రభుత్వం, అక్కడ పని చేస్తున్న అశుతోష్ శ్రీవాత్సవను బదిలీ చేసింది. 


More Telugu News