Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్త దోస్తులు.. ఆందోళనను దూరం చేసే థెరపీ డాగ్స్

Hyderabad Airport Introduces Therapy Dogs To Help Travellers Deal With Anxiety
  • శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం థెరపీ డాగ్ కార్యక్రమం
  • విమాన ప్రయాణంలో ఆందోళన, ఒత్తిడి తగ్గించడమే ప్రధాన లక్ష్యం
  • డొమెస్టిక్, ఇంటర్నేషనల్ లాంజ్‌లలో అందుబాటులో ప్రత్యేక శునకాలు
  • వాటితో ఆడుకోవచ్చు, సెల్ఫీలు దిగొచ్చు
  • దేశంలోనే ఇదొక వినూత్నమైన కార్యక్రమమంటున్న నిర్వాహకులు
విమాన ప్రయాణం అంటే చాలామందిలో ఒకరకమైన ఆందోళన, ఒత్తిడి ఉంటాయి. సమయానికి ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం, సెక్యూరిటీ చెకింగ్, విమానం కోసం గంటల తరబడి వేచి ఉండటం వంటివి ప్రయాణికులకు కాస్త టెన్షన్ కలిగిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ-శంషాబాద్) అధికారులు ఒక వినూత్నమైన, ఆహ్లాదకరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించి, వారిలో ప్రశాంతత నింపేందుకు 'థెరపీ డాగ్ ప్రోగ్రాం'ను ప్రారంభించారు.

ఈ నెల‌ ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన ఈ కార్యక్రమం ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా, ప్రత్యేకంగా శిక్షణ పొందిన టాయ్ పూడిల్ జాతికి చెందిన శునకాలను ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. సెక్యూరిటీ చెకింగ్ పూర్తయిన తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టర్మినల్స్‌లోని లాంజ్‌లలో నిపుణులైన హ్యాండ్లర్ల పర్యవేక్షణలో ఈ థెరపీ శునకాలు ప్రయాణికులతో గడుపుతున్నాయి.

ప్రయాణికులు స్వచ్ఛందంగా ఈ శునకాల వద్దకు వెళ్లి వాటితో సమయం గడపవచ్చు. వాటిని ప్రేమగా నిమరడం, వాటితో ఆడుకోవడం, ఫొటోలు దిగడం వంటివి చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా సెల్ఫీ జోన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రయాణికులకు అభినందనగా, ఒక మధుర జ్ఞాపకంగా డిజిటల్ 'థెరపీ డాగ్ సర్టిఫికెట్'ను కూడా అందిస్తున్నారు.

శునకాలతో సమయం గడపడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ వంటి హార్మోన్లు తగ్గి, ఆక్సిటోసిన్, సెరటోనిన్ వంటి ఆనందాన్నిచ్చే రసాయనాలు విడుదలవుతాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులు విమానం ఎక్కే ముందే వారి ఆందోళనను తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

మొదటిసారి ప్రయాణించే వారి నుంచి వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ప్రశాంతంగా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయంగా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణికుల కోసం థెరపీ డాగ్స్‌ను పరిచయం చేయడం ఇదే ప్రథమం.
Hyderabad Airport
Rajiv Gandhi International Airport
therapy dogs
airport stress relief
passenger experience
RGIA
toy poodle
airport relaxation
travel anxiety
airport innovation

More Telugu News