టికెట్ లేకుండా ప్రయాణించి రచ్చ చేసిన ప్రయాణికుడు.. బొరివలి స్టేషన్‌లో విధ్వంసం.. వీడియో ఇదిగో!

ముంబైలోని బొరివలి రైల్వే స్టేషన్‌లో నిన్న మధ్యాహ్నం ఒక అనూహ్య ఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి, రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా ఏకంగా టికెట్ చెకింగ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ విధ్వంసం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై తీవ్ర చర్చ మొదలైంది.

విరార్ లోకల్ రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే టికెట్ చెకర్లు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తికి టికెట్ లేకపోవడంతో వారిని బొరివలి స్టేషన్‌లో దింపి టీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే అసలు గొడవ మొదలైంది. రైల్వే నిబంధనలను పాటించకుండా, టికెట్ లేకుండా ప్రయాణించినందుకు అధికారులు ప్రశ్నించగా ఆ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయాడు. సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా కార్యాలయంలోని కంప్యూటర్లు, మానిటర్లు, కీబోర్డులు వంటి వాటిని ధ్వంసం చేశాడు. ఈ ఘర్షణలో టికెట్ ఇన్‌స్పెక్టర్ షంషేర్ ఇబ్రహీం సహా పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో పసుపు రంగు కుర్తా ధరించిన ఆ వ్యక్తి అధికారులపై అరుస్తూ, కార్యాలయంలోని వస్తువులను విసిరేయడం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా "ధారావిలో నా పేరు చెప్పు, అందరికీ తెలుసు" అంటూ అధికారులను బెదిరించాడు. ఆందోళనలో ఉన్న ఒక మహిళను ఓదారుస్తూనే, తన వీరంగం కొనసాగించాడు.

ఈ ఘటన తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నిందితులను అదుపులోకి తీసుకుని, గవర్నమెంట్ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) అప్పగించింది. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, ప్రభుత్వ ఆస్తి నష్టం వంటి తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదైంది.  

Borivali Railway Station
Mumbai
ticketless travel
railway vandalism
Virar local train
RPF
GRP
railway Protection Force

More Telugu News