హైదరాబాద్‌లో విషాదం.. దేవుడు దగ్గరికి వెళ్తానని గృహిణి ఆత్మహత్య!

  • ఐదేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న పూజ
  • ఇటీవల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంచుకున్నమహిళ
  • నిరంతరం దైవధ్యానంలో ఉంటూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి దగ్గరవుతామని లేఖ
  • ఇంట్లో అందరూ ఉండగానే ఐదో అంతస్తు నుంచి దూకిన  వైనం
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒక గృహిణి మూఢనమ్మకంతో తన అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. హిమాయత్ నగర్‌లో వ్యాపారి అరుణ్‌కుమార్ జైన్, ఆయన భార్య పూజా జైన్ (43) నివసిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గత ఐదేళ్లుగా పూజ మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమెకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది.

నిన్న అరుణ్‌కుమార్ కార్యాలయానికి వెళ్లిన తర్వాత ఇంట్లో పిల్లలు, పనిమనిషి ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఒంటరిగా గదిలో కూర్చున్న పూజ ఊహించని విధంగా ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.

సూసైడ్ నోట్‌లో షాకింగ్ వివరాలు
పూజ ఆత్మహత్య చేసుకునే ముందు కూర్చున్న గదిలో ఒక లేఖ లభించింది. ఆ లేఖలో జైన గురువుల సూక్తిని ఉటంకిస్తూ "నిరంతరం దైవధ్యానంలో ఉంటూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి దగ్గరవుతాం, స్వర్గం ప్రాప్తిస్తుంది" అనే అర్థం వచ్చేలా రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ లేఖ మూఢనమ్మకాలతో పాటు, ఆమె మానసిక స్థితి ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.   


More Telugu News