నాకు తక్కువ శిక్ష వేయండి: న్యాయమూర్తి ఎదుట బోరున ఏడ్చేసిన ప్రజ్వల్ రేవణ్ణ

  • అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ను దోషిగా తేల్చిన కోర్టు
  • ప్రజ్వల్ మొబైల్‌లో 2000కు పైగా వీడియోలు గుర్తించిన పోలీసులు
  • కేసు విచారణ సమయంలో 14 నెలలుగా జైల్లో ప్రజ్వల్
తనకు తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యర్థించారు. న్యాయమూర్తిని వేడుకుంటున్న సమయంలో బోరున విలపించాడు. నిన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే కూడా మాజీ ఎంపీ కన్నీరుమున్నీరయ్యాడు. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. మరికాసేపట్లో ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది.

కేఆర్ నగర్‌కు చెందిన ఒక మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసీపుర పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. గన్నిగడ ఫాంహౌస్‌లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్‌పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణ జరుగుతున్న క్రమంలో ఆయన 14 నెలలుగా జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.

ప్రజ్వల్ మొబైల్ ఫోన్‌లో 2000కు పైగా వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను ప్రజ్వల్ స్వయంగా రికార్డు చేసినట్లు నిర్ధారించారు. గత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఫలితాలు వెలువడే సమయానికి ప్రజ్వల్ విదేశాలకు పారిపోగా, కుటుంబ సభ్యుల సూచనతో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు.


More Telugu News