Muhammad Yunus: భారత్‌కు దూరం, చైనాకు దగ్గర.. బంగ్లాదేశ్‌కు యూనస్ పాలనతో పెను ముప్పు: గేట్‌స్టోన్ రిపోర్ట్

GateStone Report Warns of Bangladesh Under Muhammad Yunus
  • యూనస్ పాలనలో విఫల రాజ్యంగా బంగ్లాదేశ్
  • ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందని అమెరికా సంస్థ హెచ్చరిక
  • అదుపు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థ, ఆకాశాన్నంటుతున్న ధరలు
  • భారత్‌ను దూరం చేసుకుని చైనా, పాక్‌లతో స్నేహం
  • మైనారిటీలపై ఆగని దాడులు, ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు
బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర వైఫల్యాల బాటలో పయనిస్తోందని, దేశం ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ మేధోమథన సంస్థ ‘గేట్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్’ సంచలన నివేదిక వెల్లడించింది. యూనస్ పాలనలో బంగ్లాదేశ్ ఒక లౌకిక ప్రజాస్వామ్యం నుంచి మతతత్వ రాజ్యంగా రూపాంతరం చెందుతోందని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

2024 ఆగస్టులో షేక్ హసీనాను గద్దె దింపిన తర్వాత యూనస్ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి దేశం రాజకీయ గందరగోళం, ఆర్థిక సంక్షోభం, సామాజిక విచ్ఛిన్నంలోకి జారుకుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఛాందసవాద ఇస్లామిక్ శక్తుల ప్రాబల్యం పెరిగిపోయిందని, హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి సంస్థలు ఖలీఫత్ పాలన కోసం బహిరంగంగా ర్యాలీలు చేస్తుంటే, హెఫాజత్-ఎ-ఇస్లాం బంగ్లాదేశ్ వంటి సంస్థలు మహిళల హక్కులకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయని వివరించింది. జమాత్-చార్ మోనై నాయకుడు ముఫ్తీ సయ్యద్ మహమ్మద్ ఫైజుల్ కరీం, ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల తరహాలో ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారని, దీనిపై యూనస్ ప్రభుత్వం మౌనంగా ఉండటం వారి బలహీనతకు లేదా పరోక్ష అంగీకారానికి నిదర్శనమని నివేదిక ఆరోపించింది.

మైనారిటీలైన హిందువులు, ఇతర వర్గాలను రక్షించడంలో యూనస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నివేదిక తీవ్రంగా విమర్శించింది. 2024లో చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లో చక్మా వర్గానికి చెందిన సుమారు 100 ఇళ్లు, దుకాణాలను తగులబెట్టినా, బంగ్లాదేశ్ సైన్యం కనీసం జోక్యం చేసుకోలేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంది.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అయిన యూనస్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని నివేదిక ఎత్తిచూపింది. 2024 సెప్టెంబర్‌లో 9.92 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, ప్రస్తుతం 10.87 శాతానికి చేరిందని, ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 14 శాతానికి పెరిగిందని తెలిపింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నివేదిక వివరించింది.

అంతర్జాతీయ సంబంధాల విషయంలోనూ యూనస్ ప్రభుత్వం తప్పుడు విధానాలు అనుసరిస్తోందని నివేదిక పేర్కొంది. అత్యంత ముఖ్యమైన పొరుగు దేశం, ఆర్థిక భాగస్వామి అయిన భారత్‌ను దూరం చేసుకుంటోందని, దేశంలోని వరదల వంటి సమస్యలకు కూడా భారత్‌నే నిందిస్తూ యూనస్ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది. అదే సమయంలో చైనా, పాకిస్థాన్‌లతో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించింది. 1971 మారణహోమానికి పాకిస్థాన్ క్షమాపణ చెప్పకపోయినా ఆ దేశంతో సంబంధాలు బలపరుచుకోవడం అమరవీరులను అవమానించడమేనని నివేదిక వ్యాఖ్యానించింది.

శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల రక్షణ, ఆర్థిక నిర్వహణ, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ వంటి ప్రాథమిక బాధ్యతల్లో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా బంగ్లాదేశ్ బలహీనపడి, అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోయిందని గేట్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది.
Muhammad Yunus
Bangladesh
GateStone Institute
Sheikh Hasina
Bangladesh Nationalist Party
Jamaat-e-Islami
Islamic State
China
India
Terrorism

More Telugu News