అలాంటి సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారు?: లోక్‌సభలో ప్రశ్నించిన ప్రియాంక గాంధీ

  • నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు.. బాధ్యత అన్న ప్రియాంక గాంధీ
  • కాల్పుల విరమణ ప్రకటన ట్రంప్ చేయడం ప్రధానమంత్రి బాధ్యతారాహిత్యమన్న ఎంపీ
  • గతం గురించి మాట్లాడుతున్న వారు ప్రస్తుతం జరుగుతున్న వాటికి సమాధానం చెప్పడంలేదని విమర్శ
శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో యుద్ధాన్ని ఎందుకు నిలిపివేశారో చెప్పాలని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాయకత్వం అంటే కేవలం క్రెడిట్ తీసుకోవడం మాత్రమే కాదని, బాధ్యత కూడా ఉండాలని అన్నారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు చేయడం ప్రధానమంత్రి మోదీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.

జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ గురించి అమిత్ షా మాట్లాడారని, కానీ అకస్మాత్తుగా యుద్ధాన్ని ఎందుకు ఆపారో చెప్పడం లేదని ప్రశ్నించారు. దేశ చరిత్రలో యుద్ధాన్ని ఆపడం మొదటిసారి అయితే, దానిని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. బైసరన్ వ్యాలీకి వేలాది మంది వస్తారనే విషయం ప్రభుత్వానికి తెలియదా? అని ఆమె నిలదీశారు.

పాకిస్థాన్ ఇంతటి దారుణానికి పాల్పడుతుందని మన నిఘా వర్గాలు ఎందుకు గుర్తించలేకపోయాయని ప్రశ్నించారు. మన ప్రభుత్వం, నిఘా సంస్థల వైఫల్యమే దాడికి కారణమని, దీనికి బాధ్యత వహించేది ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం గురించి మాట్లాడేవారు ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.


More Telugu News