యూపీలో ఘోరం.. భ‌ర్త‌ను స‌జీవ‌దహ‌నం చేసిన భార్య‌!

  • యూపీలోని బాగ్‌న‌త్‌లో ఘ‌ట‌న‌
  • భ‌ర్త స‌న్నీని స‌జీవ‌ద‌హ‌నం చేసిన భార్య అంకిత 
  • అంకిత‌తో పాటు ప్రియుడు అయ్యూబ్, ఆమె మామ సుశీల్‌, బేబీ అనే వ్య‌క్తిపై కేసు న‌మోదు  
యూపీలోని బాగ్‌న‌త్‌లో ఘోరం జ‌రిగింది. భ‌ర్త స‌న్నీని భార్య అంకిత స‌జీవ‌ద‌హ‌నం చేసింది. ప్రియుడు అయ్యూబ్ అహ్మ‌ద్‌, అంకిత మామ సుశీల్‌, బేబీ అనే వ్య‌క్తి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. దీంతో వారిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... స్థానిక కందేరా గ్రామానికి చెందిన స‌న్నీకి గ‌ర్హీ కంగ‌రాన్ గ్రామానికి చెందిన అంకిత‌తో గ‌తేడాది పెళ్లి అయింది. ఈ నెల 22న కావ‌డీ యాత్ర‌లో భాగంగా గంగా జ‌లం తీసుకొచ్చేందుకు స‌న్నీ బైక్‌పై హ‌రిద్వార్ వెళ్లాడు. అయితే, కంగ‌రాన్ గ్రామ రోడ్డు స‌మీపంలో న‌లుగురు వ్య‌క్తులు స‌న్నీ బైక్‌ను ఆపి, అత‌నిపై దాడికి పాల్ప‌డ్డారు. 

అనంత‌రం అత‌డిని అంకిత పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లారు. అక్క‌డ స‌న్నీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాధితుడిని మొద‌ట మీర‌ట్‌లోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డి వైద్యులు ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్ ఆసుప‌త్రికి రిఫ‌ర్ చేయ‌గా.. అక్క‌డ చికిత్స పొందుతూ స‌న్నీ చ‌నిపోయాడు. మృతుని తండ్రి వేద్‌పాల్ ఫిర్యాదు మేర‌కు అంకిత‌, అయ్యూబ్‌, బేబీ, సుశీల్‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని స‌మాచారం. దాంతో కందేరా గ్రామస్థులు నిర‌స‌న‌కు దిగారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.   


More Telugu News