మహిళల పథకంలో లబ్దిదారులుగా మగవాళ్లు.. మహారాష్ట్రలో అక్రమాలు

  • లాడ్కి బహీన్ స్కీంలో అక్రమాలపై ఉపముఖ్యమంత్రి సీరియస్
  • మహిళలుగా పేర్లు నమోదు చేసుకున్న 14 వేల మంది పురుషులు
  • నెలనెలా రూ.1500 లబ్ది పొందుతున్నట్లు గుర్తించిన అధికారులు
  • వారు అందుకున్న సొమ్మంతా వసూలు చేస్తామన్న అజిత్ పవార్
మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన పథకంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వ ఆడిట్ లో తేలింది. ఏకంగా 14 వేల మంది మగవాళ్లు నెలనెలా డబ్బులు అందుకుంటున్నారని అధికారులు తేల్చారు. దీంతో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సీరియస్ గా స్పందించారు. లాడ్కి బహీన్ స్కీంలో అక్రమాలను సహించబోమని, అక్రమంగా డబ్బులు పొందిన వారి నుంచి తిరిగి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సహకరించని వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

అసలు ఏంజరిగిందంటే..
మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో మహిళల కోసం ‘లాడ్కి బహీన్’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 18 నుంచి 65 ఏళ్లలోపు ఉన్న నిరుపేద మహిళలకు నెలనెలా రూ.1,500 ఆర్థిక సహాయం అందిస్తోంది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉన్న కుటుంబాలలో గరిష్ఠంగా ఇద్దరు మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే, పథకం ప్రారంభించిన కొద్ది కాలానికే భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 

ఏకంగా 14 వేల మందికి పైగా పురుషులు కూడా ఈ పథకం ద్వారా ప్రతినెలా డబ్బులు పొందుతున్నారని తేలింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 21.44 కోట్ల నష్టం వాటిల్లిందని తాజాగా జరిగిన ఆడిట్ నివేదికలో స్పష్టమైంది. ఈ అవినీతిపై ప్రతిపక్షాలు మండిపడుతూ సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందిస్తూ.. లాడ్కి బహీన్ పథకంలో అక్రమాలను సహించబోమని, అక్రమార్కులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

Ladki Bahin Scheme
Maharashtra
Ajit Pawar
women scheme
fraud
scam
financial loss
audit report
cbi investigation
Maharashtra government

More Telugu News