Mansa Devi Temple: హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

8 Dead and 30 Injured In Stampede At Haridwars Mansa Devi Temple
  • ప్రధాన ఆలయానికి వెళ్లే ఆలయ రహదారిపై మెట్లపై తొక్కిసలాట 
  • ఎనిమిది మంది మృతి.. 30 మంది భక్తులకు గాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం
  • ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని దిగ్భ్రాంతి
ఉత్తరాఖండ్‌లోని పవిత్ర నగరం హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా, 30 మంది భక్తులు గాయపడ్డారు. ప్రధాన ఆలయానికి వెళ్లే ఆలయ రహదారిపై మెట్లపై తొక్కిసలాట జరిగింది. విద్యుత్ షాక్‌ పుకార్లు జనంలో భయాందోళనలకు కారణమయ్యాయని, తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ, తొక్కిసలాట జరగడానికి ముందే మాన్సా దేవి ఆలయం వద్ద భారీ జనసమూహం గుమిగూడిందని అన్నారు. గాయపడిన భక్తులను అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించిన‌ట్లు తెలిపారు.

మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరుష్ (12), వివేక్ (18), వకీల్, శాంతి, ఉత్తరాఖండ్‌కు చెందిన విపిన్ సైని (18), బీహార్‌కు చెందిన షకల్ దేవ్ (18)గా గుర్తించారు. వీరితో పాటు మరో 28 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఉత్తరాఖండ్ పోలీసుల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. 

"హరిద్వార్‌లోని మానస దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట చాలా బాధాకరం. ఎస్‌డీఆర్ఎఫ్‌, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక అధికారుల‌తో నేను నిరంతరం సంప్రదిస్తున్నాను. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాను. భక్తులందరి భద్రత, శ్రేయస్సు కోసం నేను ఆ దేవతను ప్రార్థిస్తున్నాను" అని ధామి అన్నారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. బాధితుల కోసం ఉత్తరాఖండ్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు: (+91) 94111 12973, 9520625934

ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని దిగ్భ్రాంతి
ప్రధాని నరేంద్ర మోదీ బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం సంభవించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక యంత్రాంగం బాధితుల‌కు సహాయం చేస్తోంది" అని ప్ర‌ధాని అన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఘ‌ట‌న‌ను తీవ్ర బాధాకరమ‌ని అన్నారు. మృతుల‌ కుటుంబాలకు ఆమె సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
Mansa Devi Temple
Haridwar
Uttarakhand
Stampede
Manasa Devi Temple Stampede
Pushkar Singh Dhami
Narendra Modi
Droupadi Murmu
India
Accident

More Telugu News