పాకిస్థాన్ కవ్వింపు చర్యలు.. 6 డ్రోన్లను కూల్చివేసిన భారత్

  • సరిహద్దుగుండా ఆయుధాలు, మత్తు పదార్థాలు దేశంలోకి పంపించేందుకు పాక్ కుట్ర
  • బుధవారం రాత్రి 5 డ్రోన్లను కూల్చివేసిన భారత్
  • గురువారం తెల్లవారుజామున మరో డ్రోన్ కూల్చివేత
పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను మన దేశంలోకి పంపించేందుకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పంపించిన ఆరు డ్రోన్లను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. ఈ ఘటనలో మూడు తుపాకులు, మ్యాగజీన్లతో పాటు ఒక కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.

ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి అనుమానాస్పద వస్తువులు భారత్ భూభాగంలోకి వస్తున్నట్లు గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది. అవి పాక్‌కు చెందిన డ్రోన్లుగా గుర్తించి వెంటనే ప్రతిస్పందించి వాటిని కూల్చివేసింది.

మోథే సమీపంలో ఐదు డ్రోన్లను కూల్చిన బీఎస్ఎఫ్, మూడు తుపాకులు, మూడు మ్యాగజీన్‌లు, దాదాపు 1.07 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. గురువారం తెల్లవారుజామున అట్టారీ దాల్ గ్రామానికి సమీపంలో మరొక డ్రోన్‌ను కూల్చివేశారు. వీటితో పాటు దాల్ సమీపంలోని పంట పొలాల్లో తుపాకీ విడిభాగాలు, ఒక మ్యాగజీన్‌ను గుర్తించారు.


More Telugu News