రోడ్డుపై విప‌రీతంగా క‌ల‌బ‌డ్డ‌ రెండు గుర్రాలు.. చివ‌రికి షాకింగ్ సీన్‌.. వైర‌ల్ వీడియో!

  • మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘ‌ట‌న‌
  • ఉన్న‌ట్టుండి ఘ‌ర్ష‌ణ‌కు దిగిన రెండు గుర్రాలు
  • వాటిలో ఒక‌టి రోడ్డుపై వెళుతున్న ఆటోపైకి దూకడంతో ప్ర‌మాదం
  • ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాలు
  • 20 నిమిషాల పాటు ఆటోలోనే చిక్కుకుపోయిన గుర్రం
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో రెండు గుర్రాలు విప‌రీతంగా ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి. అయితే, ఆ రెండు అశ్వాల కొట్లాట చివ‌రికి షాకింగ్ సీన్‌తో ముగిసింది. అందులో ఒక గుర్రం ఇ-రిక్షాలోకి దూక‌డంతో అక్క‌డే 20 నిమిషాల పాటు చిక్కుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
బుధవారం రద్దీగా ఉండే నాగరత్ చౌక్ వద్ద రెండు గుర్రాలు ఉన్న‌ట్టుండి ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి. స్థానికులు వాటిని తరిమికొట్టడానికి ప్రయత్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. అలా ఆ రెండు అశ్వాలు కలబడుకుంటూ సమీపంలోని షోరూమ్‌లోకి దూసుకెళ్లి, విధ్వంసం సృష్టించాయి. ఆ తరువాత వాటిలో ఒక గుర్రం మ‌ళ్లీ రోడ్డుపైకి వచ్చింది.

అలా వ‌చ్చిన ఆ గుర్రం రోడ్డుపై ప్రయాణీకులను తీసుకెళ్తున్న ఒక ఇ-రిక్షాపై దూకింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, ఒక ప్రయాణీకుడు తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్కల ఉన్నవారు సహాయం కోసం పరుగెత్తుకుంటూ వచ్చి గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీసి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 

అయితే, గుర్రం ఆటోలో చిక్కుకుపోయి దాదాపు 20 నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత స్థానికులు దానిని శ్ర‌మించి బ‌య‌ట‌కు తీశారు. ఈ ప్రమాదంలో అది కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, గత రెండు మూడు రోజులుగా కూడలిలో గుర్రాలు కలబడుకోవ‌డం చూసి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈ ఘ‌ట‌న చేసుకోవ‌డంతో స్థానికులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. ఇక‌, ఘ‌ట‌న తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 


More Telugu News