నా కుమారుడికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రధానికి థ్యాంక్స్: భూపేశ్ బఘేల్

  • ఛత్తీస్ గఢ్ లో లిక్కర్ స్కాం
  • నేడు మాజీ సీఎం భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు
  • బఘేల్ తనయుడు చైతన్య అరెస్ట్
  • ఘాటుగా స్పందించిన భూపేష్ బఘేల్
ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను శుక్రవారం నాడు అరెస్టు చేసింది. భిలాయ్‌లోని బఘేల్ నివాసంపై ఈడీ నిర్వహించిన తాజా సోదాల తర్వాత ఈ అరెస్టు జరిగింది. ఈ కేసు మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించినది. ఇది 2019 నుంచి 2022 వరకు భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 

శుక్రవారం ఉదయం భిలాయ్‌లోని బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది, ఈ సమయంలో భూపేష్ బఘేల్ కూడా అక్కడే ఉన్నారు. ఈ రైడ్‌లు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఎ) కింద నిర్వహించగా, ఇందులో తాజా ఆధారాల ఆధారంగా చైతన్యను అరెస్టు చేశారు. 

కాగా, తన కుమారుడ్ని అరెస్ట్ చేయడంపై భూపేష్ భఘేల్ ఘాటుగా స్పందించారు. మోదీ, అమిత్ షా ఇచ్చే ఇటువంటి కానుకలు ప్రజాస్వామ్య ప్రపంచంలో మరెవ్వరూ ఇవ్వలేరు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "గతంలో నా పుట్టినరోజు నాడు ఈ ఇద్దరు నేతలు ఈడీ అధికారులను నా సలహాదారు ఇంటిపైనా, ఇద్దరు ఓఎస్డీల ఇళ్లపైనా దాడులకు పంపించారు. ఇప్పుడు నా కుమారుడి పుట్టినరోజు నాడు నా ఇంటిపై దాడులకు అధికారులను పంపించారు. అరెస్ట్ చేయడం ద్వారా నా కుమారుడికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రధాని మోదీ గారూ" అంటూ ఘాటుగా స్పందించారు. 


More Telugu News