ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే బుధవారం (16వ తేదీ) వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నిన్న విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సి. నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి వద్ద పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చారని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువస్తూ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.

సీఐడీ తరపున వాదనలు వినేందుకు కోర్టుకు సమయం లేకపోవడంతో విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. 


More Telugu News