ప్రకాశం జిల్లాలో బాలుడి మృతిపై సీఎం చంద్రబాబు ఆరా

  • రెండు రోజుల క్రితం అంగన్ వాడి కేంద్రం నుంచి బయటకు వచ్చి దారి తప్పి అడవిలోకి వెళ్లిన వైనం
  • అడవిలో చిక్కుకుపోయి రెండు రోజుల పాటు, ఆహారం నీరు అందక లక్షిత్ మృతి చెందినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడి
  • ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలన్న సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా, కంభం మండలం, లింగోజిపల్లిలో రెండున్నరేళ్ల బాలుడు లక్షిత్ మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం అంగన్‌వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లిన లక్షిత్ దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయాడని ఎస్పీ ముఖ్యమంత్రికి తెలియజేశారు.

పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే జాగిలాలు, డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టామని, డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను నియమించి బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించామని ఎస్పీ వివరించారు. అడవిలో చిక్కుకుపోయి రెండు రోజులపాటు ఆహారం, నీరు అందక లక్షిత్ మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఎస్పీ తెలిపారు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తల్లి కాన్పు కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన లక్షిత్, అక్కడ అనధికారికంగా అంగన్‌వాడీ సెంటర్‌కు వచ్చి పోతున్నాడు. ఈ దుర్ఘటనలో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం ఉందా అనే అంశంపైనా దర్యాప్తు జరపాలని సిఎం ఆదేశించారు. 


More Telugu News