భారత నర్సుకు జులై 16న యెమెన్ లో మరణశిక్ష

  • యెమెన్‌లో హత్య కేసులో భారత నర్సుకు ఉరిశిక్ష ఖరారు
  • కేరళకు చెందిన నిమిష ప్రియకు జులై 16న శిక్ష అమలు
  • పాస్‌పోర్ట్ ఇవ్వలేదనే కోపంతో యెమెన్ పౌరుడి హత్య
  • మత్తుమందు డోస్ ఎక్కువై యెమెన్ పౌరుడి మృతి
  • ప్రస్తుతం హౌతీ మిలిటెంట్ల చేతిలో నిమిష ప్రియ కేసు!
యెమెన్‌లో ఓ హత్య కేసులో దోషిగా తేలిన భారత నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల జులై 16న ఆమెకు ఉరిశిక్షను అమలు చేయనున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల నిమిష ప్రియ, యెమెన్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. 2017లో తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుడిని ఆమె హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పాస్‌పోర్ట్‌ను తలాల్ ఇవ్వకుండా దాచిపెట్టడంతో, దానిని తిరిగి పొందేందుకు అతడికి మత్తుమందు ఇచ్చారని కోర్టు విచారణలో తేలింది. అయితే, మత్తుమందు మోతాదు ఎక్కువ కావడంతో తలాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత, నిమిష తన సహోద్యోగి హనన్ సహాయంతో మృతదేహాన్ని ముక్కలుగా చేసి నీటి ట్యాంకులో పడేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఈ కేసులో 2018 జూన్‌లోనే స్థానిక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. అప్పటి నుంచి ఈ కేసుపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విషయంపై సంబంధిత వర్గాలు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "నిమిష ప్రియకు మరణశిక్ష పడినప్పటి నుంచి మేం ఈ కేసును నిశితంగా గమనిస్తున్నాం. స్థానిక అధికారులు, ఆమె కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం" అని తెలిపారు.

ప్రస్తుతం నిమిష ప్రియ నిర్బంధంలో ఉన్న సనా నగరం హౌతీ మిలిటెంట్ల నియంత్రణలో ఉన్నందున, ఈ కేసు వ్యవహారాలను వారే పర్యవేక్షిస్తున్నారని యెమెన్ రాయబార కార్యాలయం గతంలో స్పష్టం చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

Nimisha Priya
Yemen
Indian nurse
death sentence
murder case
Kerala
Talal Abdo Mahdi
Houthi militants
Sanaa

More Telugu News