Chandrababu Naidu: శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Offers Jalharati to River Krishna at Srisailam
షార్ట్స్‌లో చూడండి
నేడు శ్రీశైలంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, కృష్ణమ్మకు జలహారతి సమర్పించి, ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాయలసీమ అభివృద్ధికి తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు.

రాయలసీమకు జలకళ
ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడానికి ముందు శ్రీశైల మల్లన్నకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా జీవితంలో ఇది అత్యంత సంతోషకరమైన రోజు. జులై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడం శుభపరిణామం. జలాలే మన నిజమైన సంపద, సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు. వాటితోనే రైతుల కష్టాలు తీరతాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 200 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది" అని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గతంలో రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలామంది అన్నారని, కానీ స్వర్గీయ ఎన్టీఆర్ ఆ పరిస్థితిని మార్చేందుకు నడుం బిగించారని గుర్తుచేశారు.

సాగునీటిపై నిర్దిష్ట లక్ష్యాలు
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చంద్రబాబు స్పష్టం చేశారు. జీడిపల్లికి నీటిని తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఆ ప్రాంతానికి నీరు అందించాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించినట్లు వెల్లడించారు. అలాగే, జులై 30 నాటికి కుప్పం, మదనపల్లెకు సాగునీరు చేరాలని ఆదేశించినట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట వంటి ప్రాజెక్టులను తామే తీసుకువచ్చామని చెప్పారు.

అభివృద్ధిపై బ్లూప్రింట్ సిద్ధం
గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమను పూర్తిగా విస్మరించిందని చంద్రబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి తన వద్ద స్పష్టమైన బ్లూప్రింట్ ఉందని, పోలవరం వల్లే సీమకు నీళ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు ప్రాంతాలను పారిశ్రామిక హబ్‌లుగా తీర్చిదిద్దుతామని, దేశంలోనే అత్యుత్తమ రోడ్ల వ్యవస్థను ఈ ప్రాంతంలో నిర్మించామని తెలిపారు. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవాలన్నదే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Srisailam
Rayalaseema
Andhra Pradesh
Irrigation Project
Water Resources
Nimmala Ramanayudu
Polavaram Project
Galeeru Nagari
Pothireddypadu

More Telugu News