Rama Devi: భద్రాచలం ఆలయ ఈవోపై దాడి.. స్పృహ కోల్పోయిన రమాదేవి

Rama Devi Bhadrachalam temple EO attacked
  • పురుషోత్తపట్నంలో ఆలయ భూముల అంశంపై ఘర్షణ
  • ఆలయ భూముల్లో ఆక్రమణలను ఈవో అడ్డుకోవడంతో గ్రామస్థుల దాడి
  • దాడిలో స్పృహ కోల్పోయిన మహిళా అధికారి
  • భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స
  • హైకోర్టు ఆదేశాలను లెక్కచేయని ఆక్రమణదారులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై కొందరు గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది ఆమెను భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రామాలయానికి చెందిన సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొందరు వ్యక్తులు కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

సమాచారం అందుకున్న ఈవో రమాదేవి, ఇతర ఆలయ సిబ్బందితో కలిసి మంగళవారం ఆ ప్రాంతానికి చేరుకుని నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆక్రమణదారులకు, ఆలయ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలోనే ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన మహిళా అధికారిపై దాడి జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Rama Devi
Bhadradri Ramalayam
Bhadradri Temple
Purushottampatnam
Temple lands

More Telugu News