ట్రంప్ దెబ్బ.. తగ్గిన బంగారం ధర
- అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా తగ్గిన బంగారం ధర
- అమెరికా దిగుమతి సుంకాలు పెంచడమే ప్రధాన కారణం
- ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి రూ.97,136 వద్ద ట్రేడింగ్
- స్వల్పంగా పెరిగిన వెండి ధర.. కిలో రూ.1,08,402
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం ధర నష్టాలతో మొదలైంది. 10 గ్రాముల పసిడి ధర 0.14 శాతం తగ్గి రూ.97,136 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు రోజు ముగింపు ధర రూ.97,270తో పోలిస్తే ఇది రూ. 134 తక్కువ. మరోవైపు, వెండి ధరలో సానుకూలత కనిపించింది. కిలో వెండి ధర 0.07 శాతం పెరిగి రూ.1,08,402 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా చూస్తే డాలర్ విలువ బలోపేతం కావడం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో బంగారం ధరలపై ఒత్తిడి నెలకొంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,334 డాలర్ల వద్ద నిలకడగా ఉంది. ఆగస్టు 1 నుంచి దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అయితే, ఈ నిర్ణయం అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం కొంత ఉపశమనం కలిగించింది.
రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది మాట్లాడుతూ "పసిడి ధరల ధోరణి నిలకడగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. ఎంసీఎక్స్లో బంగారం ధరకు రూ.96,800 వద్ద బలమైన మద్దతు, రూ.97,300 వద్ద నిరోధం ఉంది" అని విశ్లేషించారు. మెహతా ఈక్విటీస్ నిపుణుడు రాహుల్ కలాంత్రి కూడా ఇదే విధమైన అంచనాలను వెలువరించారు. మదుపరులు తదుపరి సంకేతాల కోసం బుధవారం వెలువడనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.